ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజికవర్గానికి ఇది బ్యాడ్ న్యూస్ లాంటిదే. గత సర్కార్…. అమల్లోకి తెచ్చిన కాపులకు ఐదు శాతం వాటా కొనసాగించే విషయంలో ఏపీ సర్కార్ అంత సుముఖంగా లేదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీలో తన మాటల ద్వారానే తేల్చి చెప్పారు. ఆ కోటా కొనసాగింపుపై… న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పారే కానీ.. తమ ప్రభుత్వం.. ఆ ఐదు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని కాని.. అవసరమైన చిక్కులను తొలగించి కాపులకు న్యాయం చేస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు. దాంతో.. ఏపీలో కాపు కోటా పరిస్థితి డొలాయమానంలో పడింది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకిచ్చిన చంద్రబాబు..!
కేంద్రం ఎన్నికలకు ముందు… ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి.. పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. అవసరమైన మార్పులు చేసుకుని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అన్వయించుకోవచ్చు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంతకు మించిన చాన్స్ దొరకదనుకున్న చంద్రబాబు… ఆ పది శాతంలో ఐదు శాతం కాపులకు కేటాయించారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేశారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భాగంగా కల్పించారు. మిగిలిన వారికి ఐదు శాతం ఇస్తారు. రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేసి.. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం.. తొమ్మిదో షెడ్యూల్ లో .. ఆ బిల్లును చేరిస్తే.. కాపులకు రిజర్వేషన్లు వచ్చినట్లే. కానీ కేంద్రం.. ఆ బిల్లును పెండింగ్ లో పెట్టేసింది. దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు.
కేంద్ర చట్టంలో మార్పులు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు..!
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులు చేయకూడదని.. కొంత మంది బీజేపీ , వైసీపీ నేతలు వాదించారు. అలా చేసినా చెల్లదన్నారు. కానీ.. కేంద్రం చేసిన చట్టం.. రిజర్వేషన్లు అమలు.. కేంద్రానికే పరిమితం. కేంద్రం భర్తీ చేసే ఉద్యోగాలు, విద్యాసంస్థలల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే అది చెల్లుబాటవుతుంది. రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే.. ఏపీలోని ఉద్యోగ, విద్యా ఇతర అంశాల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో మార్పులు చేసుకోవచ్చని… పలు రాష్ట్రాలు చేస్తున్నది అదేనని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఈ కోటా బిల్లలు మార్పులు తెచ్చి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి.
అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా జగన్ ఐదు శాతం ఎందుకివ్వరు..?
ప్రస్తుతం అధికారికంగా చూస్తే.. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వ విధానం వేరుగా ఉంది. ఆ రిజర్వేషన్ల అంశాన్ని పట్టించుకోకూడదన్న పద్దతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన ప్రస్తుతం.. దీనిపై కోర్టులో కేసులున్నాయని చెబుతున్నారు. కేసులున్నాయి కానీ.. ఎక్కడా అమలు చేయకూడదని స్టేలు ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో యాథవిధిగా.. కోటా కిందట.. రిజర్వేషన్ సర్టిఫికెట్లు కాపులకు జారీ చేస్తే.. వారికి అన్ని రకాల ప్రయోజనం కలుగుతుంది. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. ఆ రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న పట్టదలతో ఉన్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీసీలకు ఆగ్రహిస్తారనో.. చంద్రబాబుకు పేరొస్తుందనో..ఏపీ సర్కార్.. వీటిపై వెనుకడుగు వేస్తోందని… రాజకీయవర్గాలు చెబుతున్నాయి.