సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సీఎం చంద్రబాబు దేశాన్ని ఏకం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్నిదించాలనే లక్ష్యంగా ఆయన కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు పిలుపుతో బీజేపేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ పక్రియలో భాగంగా చంద్రబాబు దూకుడు పెంచారు. గురువారం మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చెన్నై వెళ్లారు. డీఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమయ్యారు. స్టాలిన్ , చంద్రబాబు మధ్య భేటీలో కనిమొళి, కేంద్ర మాజీ మంత్రులు ఏ. రాజా. టిఆర్ బాలు సహా పలువురు నేతలు పాల్గొన్నారు బీజేపీయేతర కూటమి విషయంలో .. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కీలకమైన ముందడుగు వేసినట్లే చెప్పుకోవాలి. డీఎంకే.. ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఉంది. అయితే.. ఇటీవలి కాలంలో.. ఆ పార్టీ బీజేపీకి దగ్గరవుతోందన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే కొన్ని వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. కానీ చంద్రబాబు మీటింగ్ తర్వాత స్టాలిన్ స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. కూటమిని ఓన్ చేసుకున్నట్లు ఆయన మాట్లాడారు.
కూటమి నాయకులంతా ఒక మీటింగ్ పెట్టుకోవాలని దశల వారిగా పనులు సాగించాలని సూచనలు కూడా చేశారు. ఎవరు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో నిర్ణయించాల్నారు. సమావేశానికి తానూ వస్తానని ప్రకటించారు. కనీస ఉమ్మిడి కార్యక్రమం కూడా ఉంటుందని మరో అడుగు ముందుకు వేశారు. త్వరలో దీనిపై చర్చిస్తామన్నారు. స్టాలిన్ స్పందన చూసిన తర్వాత చంద్రబాబుకు ఓ నమ్మకం కలిగింది. తమిళనాడులో… కేంద్ర సంస్థలను అడ్డు పెట్టుకుని.. రిమోట్ పాలన సాగిస్తోందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి తాను కూటమి ఏర్పాటు చేయడం లేదని, కూటమికి తాను నాయకత్వం వహించబోవడం లేదని చంద్రబాబు చెప్పారు . మేము చేతులు కలిపామని… అందరినీ ఒక వేదికపైకి చేర్చే పని చేపట్టామని ప్రకటించారు. ఎలా ముందుకు సాగాలో అందరూ నిర్ణయిస్తారన్నారు. ఒకరిద్దరికి విభేదాలు ఉండొచ్చు. అభిప్రాయభేదాలు ఉండొచ్చు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్తో విభేదించాం. ఇప్పుడు కాంగ్రెస్తో కలిశాం. ప్రస్తుతం మాకు దేశం ముఖ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం కొన్ని విభేదాలను పక్కన పెట్టాల్సిందేనని చంద్రబాబు కృత నిశ్చయం చూపించారు.
మోదీ హయాంలో సీబీఐ నుంచి ఆర్బీఐ వరకు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఆర్బీఐ గవర్నర్ కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై రావాల్సి ఉందన్నారు. చెన్నై మహానగరానికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. మరో పక్క స్టాలిన్ కూడా మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపించారు. అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. మతతత్వ బీజేపీని గద్దె దింపుతామన్నారు. మొత్తానికి కర్ణాటకలో కుమారస్వామి, దేవేగౌడ ఇచ్చిన భరోసా కన్నా.. స్టాలిన్ స్పందన.. చంద్రబాబును మరింత ఆనందానికి గురి చేసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.