ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఉంది… కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత మంది ప్రముఖ నేతలు… తమ తమ కోటా కింద.. కొన్ని కొన్ని సీట్లు లెక్కలు వేసుకుని… పంచుకున్నారు. మరికొన్ని చోట్ల.. సీనియర్ నేతలకు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప… ఈ జాబితాలో అంతకు మించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు, వివరాలు ఏమీ లేవు. కానీ పీసీసీ చీఫ్ కాబట్టి… ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే ఎక్కువ టిక్కెట్లు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి కొంత మందికి టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ అంటూ.. ఓ రూల్ పెట్టుకున్నారని…ప్రచారం జరిగినా…. దాన్ని బ్రేక్ చేశారు. తనకు హూజూర్ నగర్ టిక్కెట్తో పాటు.. తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి కోదాడ టిక్కెట్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆమె అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే . పొత్తుల్లో భాగంగా కోదాడ ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టినా.. ఉత్తమ్ ససేమిరా అన్నారు. ఈ విషయంలో ఆయనకు ఒక్కరికే మినహాయింపు ఇస్తే.. కోమటిరెడ్డి బ్రదర్స్.. మీద పడి రచ్చ చేయడం ఖాయంగా కాబట్టి… కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండతో పాటు.. ఆయన సోదరుడు… రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఖరారు చేశారు. కానీ తన కుమారుడికి మిర్యాలగూడ టిక్కెట్ ఇప్పించుకోవాలనుకున్న జనారెడ్డికి మాత్రం.. నిరాశే ఎదురయింది.
ఇక నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్యకు టిక్కెట్ ఇవ్వకపోతే తాము పోటీ చేయబోమని.. వారిద్దరూ మీడియా ముఖంగా ఇచ్చిన వార్నింగ్కు ఉత్తమ్ లొంగిపోయారు. ఆ టిక్కెట్ను… చిరుమర్తి లింగయ్యకే ఖరారు చేశారు. రేవంత్ కోటాలో… పెద్దపల్లి విజయరమణారావుకు.. ములుగు నుంచి సీతక్కకు మాత్రమే చాన్స్ దక్కింది. సూర్యాపేట నుంచి … గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన… పటేల్ రమేష్ రెడ్డి కోసం .. రేవంత్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ… ఉత్తమ్ మాత్రం.. రామిరెడ్డి దామోదర్ రెడ్డి కోసమే పట్టుబట్టారు. చివరికి ఉత్తమ్ మాటే నెగ్గింది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఉత్తమ్ తన మాట నెగ్గించుకోగలిగారు. పొత్తుల్లో భాగంగా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని… సీపీఐ పట్టుబడుతున్న ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇదే కాదు.. టీజేఎస్కు కేటాయిస్తారని భావించిన రామగుండం స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించారు.
అయితే ఈ జాబితాలో .. చోటు దక్కని ఏకైక సీనియర్.. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యే. జనగాం నుంచి పోటీ చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే… సీటును పెండింగ్లో పెట్టారు. మామూలుగా 74 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారని.. నాలుగు రోజుల కింద చెప్పుకొచ్చారు కానీ… సోనియా గాంధీకి ఫిర్యాదులు అధికంగా వెళ్లడంతో.. ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన కొన్ని పేర్లను తప్పించారు. వాటిలో… ఖానాపూర్ నుంచి..ఖరారయిందని అనుకున్న రమేష్ రాథోడ్ పేరు కూడా ఉంది. ఓ వైపు.. సొంత పార్టీ నేతలు..మరో వైపు మిత్రపక్షాల ఒత్తిళ్లతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు సినిమా ప్రారంభం కానుంది.