ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు… తిరుపతిలో.. తన కాలేజీ విద్యార్థులతో.. ఓ ప్రదర్శన నిర్వహించారు. అదేమిటంటే… తన కాలేజీకి.. ప్రభుత్వం కోట్లకు కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పడిందని.. చంద్రబాబు ఇవ్వడం లేదని… అందుకే.. రోడ్డున పడ్డానని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలలు గడిచిపోతున్నాయి కూడా. మరి ఫీజు బకాయిలు వచ్చాయా… అంటే.. రాలేదు .. మరిన్ని పేరుకుపోయాయనని… ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
కాలేజీ యాజమాన్యాలకు రూ. 2300 కోట్ల బకాయి పడిన ఏపీ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ప్రకారం.. విద్యార్థులందరికీ.. వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అంటే.. విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసేది లేదు. చేయకూడదు కూడా. కానీ.. ఇక్కడే పీట ముడి పడింది. రాష్ట్రంలో 460కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గత ప్రభుత్వం రూ.35 వేలు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు మొత్తాలు విడుదల చేయాలి. నాలుగేళ్ల పాటు.. సక్రమంగా.. ఫీజు బకాయిలు ఇచ్చిన గత సర్కార్ ఎన్నికల ఏడాదిలో మాత్రం.. పెండింగ్లో పెట్టింది. ఈ మొత్తం బకాయిలు రూ.2,300 కోట్లుగా ఉంటాయి.
వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ హామీపై ఏపీ సర్కార్ నాన్చుడు..!
ఇప్పుడు మళ్లీ కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఇటీవల అధికారం చేపట్టిన వైసీపీ ఫీజు మొత్తం తామే భరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై… అడ్మిషన్ల గడువు ముగుస్తున్నా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో అటు విద్యార్థులు.. ఇటు.. కాలేజీ యాజమాన్యాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. పెద్దగా అడ్మిషన్లు లేకపోవడం, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. పాత బకాయిలు విడుదల చేయాలని… కొత్తగా.. ఫీజు రీఎంబర్స్ మెంట్ విధి విధానాలను విడుదల చేయాలని వారు… సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు.
మోహన్ బాబు ఒత్తిడి తేవాలని కోరుకుంటున్న యాజమాన్యాలు..!
ప్రభుత్వం నుంచి.. ఎలాంటి స్పందన రావడం లేదు. ఫీజులను ఖరారు చేయడానికే ఏపీ సర్కార్ నాన్చింది. పది శాతం అయినా పెంచుతారేమోనని.. అనుకున్నా.. చివరికి.. గత ఏడాది.. ఫీజులనే ఖరారు చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్పై ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు… మార్గదర్శకాలు ఇవ్వలేదు. దాంతో విద్యార్థులను చేర్చుకోవడానికీ తంటాలు పడుతున్నారు. ఏపీలో చాలా వరకు ఇంజీనిరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోలేదు. ఇప్పుడైనా మోహన్ బాబు… కాలేజీ యాజమాన్యాలకు మద్దతుగా.. మళ్లీ రోడ్డెక్కుతారో.. లేక.. సొంత పార్టీ కాబట్టి… సైలెంట్ గా ఉంటారోనని.. ప్రైవేటు కాలేజీల సంఘం నేతలు.. గుసగుసలాడుకుటున్నారు.