ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అనేకానేక కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాల్లో పేర్లు వినిపించిన వారికి.. సీబీఐ చార్జిషీట్లలో పేర్లు ఉన్న వారికి పదవులు.. ఇతర ప్రయజనాలు లభిస్తున్నారు. ఈ క్రమంలో.. అత్యంత వివాదాస్పదమైన వాన్ పిక్ విషయంలోనూ కొత్తగా కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది. వాన్ పిక్ ప్రాజెక్టు విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందని ఈడీ నిర్ధారించి.. ఆ భూములను ఎటాచ్ చేసింది. రైతుల వద్ద నుంచి ఆ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. అయితే.. తమ భూములు తీసుకున్న దానికి ఉపయోగించడం లేదన్న కారణంగా రైతులు వారి భూములను వారు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తక్షణం ఆ భూముల నుంచి పంటలు తొలగించి ..ఖాళీ చేయాలని ఆ నోటీసుల సారాంశం.
వాన్ పిక్ స్కాం బయటకు వచ్చిపన్పుడు గగ్గోలు రేగింది. ఈ కేసు వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చాలా కాలంపాటు సెర్బియా జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. అయితే.. వాన్ పిక్ విషయంలో రస్ అల్ ఖైమా అనే దేశం వద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకున్నారు. కేసులు పడటంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. తమ పెట్టుబడుల సంగతేమిటని రస్ అల్ ఖైమా ప్రశ్నిస్తోంది. అయితే కేసులు సీబీఐ, ఈడీ విచారణలో ఉండటం.. భూములు ఎటాచ్లో ఉండటంతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
అప్పట్లో రాజకీయ పార్టీలు వాన్పిక్ పేరుతో సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తామని ప్రకటించాయి. అయితే ఈడీ అటాచ్లో ఉండటంతో సాధ్యం కాలేదు. కానీ ఎవరి భూములు వారు సాగు చేసుకున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వాన్ పిక్ భూముల నుంచి రైతుల్ని ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంది. మామూలుగా అయితే ఈడీ అటాచ్లో ఉన్న భూముల్ని ప్రభుత్వ అధికారులు పెద్దగా పట్టించుకోరు. ఈడీ ప్రత్యేకంగా కోరితే తప్ప చర్యలు తీసుకోరు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ అధికారులు .. వాన్ పిక్ భూముల్నించి రైతుల్ని ఖాళీ చేయించేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.