గత కొద్ది రోజులుగా టీవీ9 త్వరలో ప్రసారం కానున్న ఆపరేషన్ చార్లీ గురించి ఒక రేంజ్ లో ట్రైలర్ చూపించింది. ఎక్స్ప్లోజివ్ బాంబ్ గా దాన్ని అభివర్ణించింది. మీడియా చరిత్రలో సంచలనం సృష్టించే ఆపరేషన్ చేశామని, సంచలనాత్మకమైన కథనాలను ప్రసారం చేయబోతున్నామని ప్రకటించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉన్నప్పటికీ, మొన్న మొన్నటి దాకా నంబర్ వన్ స్థానంలో కొనసాగినప్పటికీ, ఒక్క సారి కూడా అధికార పార్టీ లకు కనీసం సూది గుచ్చుకునేంత నొప్పి కూడా కలగకుండా కథనాలు ప్రసారం చేసిన టీవీ9 ఈసారి ఏమైనా రూటు మార్చి తెలుగు రాష్ట్రాలు నివ్వెరపోయే వాస్తవాలను బయట పడుతుందేమో అని భావించిన ప్రేక్షకుల అంచనాలను తుస్సుమనిపించేలా ఆపరేషన్ చార్లీ కథనాలు ఎట్టకేలకు ప్రసారం చేసింది టీవీ9. వివరాల్లోకి వెళితే..
ఇన్నాళ్లు ఇంత ఉదర గొట్టింది గోవాలో దొరుకుతున్న డ్రగ్స్ గురించట:
ఒక శాస్త్రవేత్త 20 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి చివరికి కరివేపాకు కూడా ఒక ఆకే అని కనుక్కున్నాడట. ఇది జోక్ మాత్రమే అయినప్పటికీ టీవీ9 ప్రస్తుతం ప్రసారం చేసిన సంచలనాత్మక కథనాలు కూడా ఇలాగే ఉన్నాయి. గోవాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజల్లో చాలా కాలంగా ఒక అభిప్రాయం ఉంది. సంచలనాత్మక కథనాలు, నివ్వెరపరిచే వాస్తవాలు అని చెప్పి చివరికి ప్రజలకు ఇదివరకే తెలిసిన, అవగాహన ఉన్న అంశాన్ని ప్రసారం చేయడంతో ఇన్ని రోజుల పాటు టీవీ9 ఊదరకొట్టింది దీని గురించా అని ప్రేక్షకులు భావించారు.
తెలుగు రాష్ట్రాల్లో నివ్వెరపరిచే వాస్తవాలు లేవా ? టీవీ9 కి కనిపించవా? లేక ఛానల్ కి ధైర్యం లేదా?
నిజానికి ప్రజలను నివ్వెరపరిచే వాస్తవాలతో ఆపరేషన్ చేయాలని టీవీ9 భావిస్తే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో అందుకు అనువైన బర్నింగ్ టాపిక్స్ చాలా నే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల లోని రాజకీయ నాయకుల భూ సెటిల్మెంట్లు, కొన్నిచోట్ల అధికార ప్రతిపక్షాల నాయకులు కుమ్మక్కై చేస్తున్న దోపిడీలు, ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాజకీయ నాయకుల పాత్ర ల పై అనుమానాలు, ఇసుక దోపిడి లో అధికార పార్టీల కు చెందిన వ్యక్తుల జోక్యాలు – ఇలా ఒకటేమిటి, అనేక అంశాలు ఉన్నాయి. సామాన్యులకు సైతం తెలిసిన ఇలాంటి అంశాలే కాకుండా, రాజకీయ వర్గాలకు మీడియా వర్గాలకు మాత్రమే తెలిసిన మరెన్నో నివ్వెరపరిచే వాస్తవాలు ఉన్నాయి. కానీ వీటిలో వేటిమీద టీవీ9 ఆపరేషన్లు చేయలేదు. బహుశా భవిష్యత్తులో చేస్తుందన్న నమ్మకం కూడా ప్రేక్షకులకు లేదు. ఎక్కడో గోవాలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఆపరేషన్లు చేసి తామేదో ఘనకార్యం చేశామని ప్రేక్షకులను నమ్మించ తలుచుకుంటే అది వారి ఇష్టం కానీ ,శప్రేక్షకులకు మాత్రం ఆ చానల్ పై ఇటువంటి ఆపరేషన్ లు మరింత విశ్వసనీయతను పెంచే అవకాశం లేదని సామాన్య ప్రేక్షకుడి భావం.
పోనీ డ్రగ్స్ విషయంలో నైనా ధైర్యంగా వ్యవహరించారా? తెలుగు రాష్ట్రాల వ్యవహారాలను బయటికి తీశారా అంటే అది లేదు..
సరే పోనీ, డ్రగ్స్ అన్నది తీవ్రమైన సమస్య, భవిష్యత్తు తరాల ని డ్రగ్స్ నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని టీవీ9 భావిస్తే, ఆయా డ్రగ్స్ లింకులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వెలికి తీయాల్సింది. అప్పుడు అది నిజంగా నివ్వెరపరిచే ఆపరేషన్ అయి ఉండేది. కానీ టీవీ9 మాత్రం, గోవాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలి వస్తున్నాయని చెబుతూనే, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు మాత్రం పకడ్బందీగా పనిచేస్తున్నారని, అన్నింటినీ అరికట్టేస్తున్నారని, సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనల సమయంలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో గంజాయి వంటివి విరివిగా దొరుకుతున్నాయి అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. కనీసం ఇటువంటి వాటిలోని వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం అయినా టీవీ9 చేసి ఉంటే తెలుగు ప్రజలకు tv9 కథనాలు మేలు చేసి ఉండేవని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎంత సేపూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేస్తున్నాయని, మనకి ఇక్కడ ఏ సమస్యలు లేవని, ఎక్కడో గోవాలో, ఉత్తరప్రదేశ్ లో మాత్రమే సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా టీవీ9 ఆపరేషన్లు, కథనాలు ఉన్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఉంది.
మొత్తం మీద:
తెహెల్కా వంటి చిన్న చిన్న సంస్థలు చేసిన ఆపరేషన్లు గతంలో ప్రభుత్వాలను తలకిందులు చేశాయి. దేశం మొత్తాన్ని విస్మయ పరిచాయి. కానీ దేశ వ్యాప్తంగా గొప్ప నెట్వర్క్ కలిగిన టీవీ9, తెలుగు రాష్ట్రాలలో దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టేలా ఏనాడూ ఆపరేషన్ లు చేయలేదనే ప్రేక్షకుల అభిప్రాయాలను తారుమారు చేసేలా, రాష్ట్ర ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా భవిష్యత్తులో టీవీ9 నిజంగా నివ్వెరపరిచే ఆపరేషన్లు ఏవైనా చేస్తుందేమో అన్నది వేచి చూడాలి.