జగన్ పాలనలో- ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఇసుకను ప్రైవేటు పరం చేయడం, ప్రైవేటు వారి ఆధీనంలో ఉండే మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదు అంటూ జగన్ పై జనసేన పార్టీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లు వైఎస్సార్సీపీని , ఆ పార్టీ అభిమానులను ఇరకాటంలో పెడుతూ ఉంటే, సామాన్య ప్రజలను మాత్రం ఆలోచింపజేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జె పి పవర్ అనే సంస్థకు ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకానికి సంబంధించిన పనులు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నామమాత్రపు ఖర్చులతో దాదాపు ఉచితంగా లభించిన ఇసుక గత కొద్ది ఏళ్లుగా సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నూతన ఇసుక పాలసీని తీసుకొని వచ్చారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీని ప్రజలందరూ అభినందిస్తున్నారు అంటూ ప్రభుత్వ పెద్దలు తరచూ గొప్పలు చెబుతూ వచ్చారు. మరి ప్రజలందరూ అభినందిస్తున్నారని చెబుతూ వచ్చిన ఆ పాలసీని మారుస్తూ, తాజాగా ఒక ప్రైవేటు సంస్థకు ఇసుకను అప్పచెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీసింది.
అంతేకాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో – వందకోట్లు దాటిన ఏ టెండర్ అయినా శివశంకరరావు చైర్మన్ గా ఉన్నటువంటి ఏపీ జుడిషియల్ కమిషన్ ద్వారా సమీక్ష చేయించిన తర్వాతే ఖరారు చేయాలని, 15 రోజులు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలని చట్టం చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, ఇప్పుడు జెపి పవర్ సంస్థకు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టు విషయంలో ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని, ఏపీ జ్యుడీషియల్ కమిషన్ తో ఎందుకు సమీక్ష చేయించ లేదని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన ఇసుక వంటి సామాజిక ఆస్తులను ప్రైవేటు పరం చేస్తూ, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న మద్యం వంటివాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం చోద్యం అంటూ సెటైర్స్ వేశారు.
ఏదిఏమైనా తాజాగా వైఎస్ఆర్సిపి తీసుకున్న ఇసుక ప్రైవేటుపరం నిర్ణయాన్ని అటు విపక్షాలే కాకుండా సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.