తెలుగుదేశం పార్టీ నేతలు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రజలకు రుచి చూపించాలనుకుంటున్నారు. వ్యూహాత్మకంగా అక్కడొకటి.. అక్కడొకటి ప్రారంభిస్తున్నారు. ఎన్నారైల సహకారంతో గుంటూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురంలోనూ ఆయన సతీమణి మరొకటి ప్రారంభిచారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు మూత వేసి దగ్గర నుంచి నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు సొంత ఖర్చు.. దాతల ఔదార్యంతో అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. వాటికి మంచి ఆదరణ ఉండటంతో ఇతర నేతలూ ప్రారంభించేలా మోటివేట్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకం తన పాలనలో ప్లస్ పాయింట్లను ప్రజల ముందు ఉంచుతోంది. ప్రస్తుత ప్రభుత్వం నగదు బదిలీ పథకాలనే అమలు చేస్తోంది. కానీ ఆ డబ్బు అందుకుంటున్న లబ్దిదారులకు పెరిగిన ధరలతో అవి ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. పథకాల కోసమే రేట్లు పెంచారని నమ్ముతున్నారు. అదే సమయంలో పథకాలు అందని లబ్దిదారుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది.
నిజానికి అన్న క్యాంటీన్లు చాలా మంది ఆకలి తీర్చాయి. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోలేని పేదలు ఆకలి తీర్చుకునేవారు. స్తోమత ఉన్న వారెవరూ వచ్చే వారు కాదు. చిరుద్యోగులు.. చిరు వ్యాపారులు.. నిలువ నీడ లేని వాళ్ల కడుపు నింపేది. అందుకే వైసీపీ కూడా ఆ సమయంలో తమ పార్టీ తరపున రూ. నాలుగుకే భోజనం పెడతమని వైఎస్ఆర్ క్యాంటీన్లను ప్రారంభించింది. కానీ తీరా అధికారం అందుకున్నా అన్న క్యాంటీన్లతో పాటు వైఎస్ఆర్ క్యాంటీన్లు కూడా మూసేసి పేదలను ఆకలితో అలమటించేలా చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఆ అన్న క్యాంటీన్లను గుర్తుకు చెచ్చేందుకు సిద్ధమవుతోంది.