జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయదశమి రోజున తిరుపతి నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 6నెలల్లో రాష్ట్రమంతా పర్యటన,ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయరుకానీ.. దానికి సమానమైన యాత్ర చేస్తారని నాగబాబు ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ అలా ప్రకటన చేయగాేన.. ఇలా నాగబాబు ట్వీట్ చేశారు. తిరుపతి నుంచి అక్టోబర్ 5న విప్లవం ప్రారంభమవుతుందన్నారు.
మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని జనసైనికులు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏపీ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడానికి ఎనిమిది నెలల డెడ్ లైన్ పెట్టారు. అంటే ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు యాత్రలు చేస్తున్నాయి. టీడీపీ కూడా జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నారు.
ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనుకుంటున్న పవన్ కల్యాణ్.. తన రాజకీయ యాత్రను తిరుపతి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి పోటీ కూడా అక్కడి నుంచే చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.