మూడు రాజధానుల కోసం అంటూ వశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఆయన లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదు. దాన్ని స్పీకర్కు కూడా పంపలేదు. నాన్ పొలిటికల్ జేఏసీకి ఇచ్చారు. ఈ రాజీనామా రాజకీయమా.. లేకపోతే ఇంకేదైనా వ్యూహమా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ధర్మశ్రీ చేసిన రాజకీయం.. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా వ్యవహారమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు లేఖ స్పీకర్ వద్దనే ఉంది. ఉపఎన్నిక తేవాలనుకుంటే.. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమోదించాలని పట్టుబడుతున్నారు. అయితే ఇంత వరకూ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆయన పదే పదే స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటంలేదు. దీంతో ఆయన కోర్టుకెళ్లాలని కూడా అనుకున్నారు. కానీ రాజీనామా ఆమోదించడం..ఆమోదించకపోవడం స్పీకర్ పరిధిలోనిది కాబట్టి… వెనుకడుగు వేశారు. నిజానికి గంటా రాజీనామాను ఆమోదించడం స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిమిషం పని. కానీ ఎందుకో కానీ ఆయన నిర్ణయం తీసుకోవడం లేదు.
ఒక వేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయి. మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీ కోరుకున్నట్లుగా ప్రజాభిప్రాయం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇతరులు రాజీనామాచేయాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో నిబందనలకు అనుగుణంగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతల రాజకీయాలేంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది.