దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల బాలకృష్ణ వీరసింహా రెడ్డి ప్రమోషన్స్ లో భాగంలో ఒక టీవీ ఛానల్ లో దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం మండిపడింది. దేవాంగ కులాన్ని కించపరిచే విధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు వున్నాయని, ఆయన చెప్పిన చరిత్రలో వాస్తవం లేదని, దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని ఏ పురాణంలో వుందని ప్రశ్నించారు. తమ కులంపై తప్పుగా మాట్లాడిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ వివరణ ఇచ్చారు. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి కృతజ్ఞతలు. నా మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ? పొరపాటును క్షమిస్తారని ఆశిస్తున్నాను” అని కోరారు బాలకృష్ణ.