బీజేపీతో ఇప్పటికిప్పుడు లొల్లి పెట్టుకోవడం ఎందుకని ఫైనల్గా వైసీపీ ఓ అభిప్రాయానికి వచ్చింది. అందుకే జేపీ నడ్డా, అమిత్ షాపై పూర్తి స్థాయిలో విమర్శలు తగ్గించేసింది. వారిద్దరూ విమర్శలు చేయడానికి టీడీపీ కోవర్టులే కారణం అనే వాదన తెరపైకి తీసుకు వచ్చారు. మొదట విజయసాయిరెడ్డి .. తన ట్విట్టర్లో ఈ తరహా కామెంట్ చేయగా.. మిగతా అందరూ అదే అందుకున్నారు. టీడీపీ అధినేత.. బీజేపీలో చేర్పించిన వారి కారణంగానే వారిద్దరూ అలా మాట్లాడారని.. ఆ స్క్రిప్టును వాళ్లే రాసిచ్చారని.. జేపీ నడ్డా, అమిత్ షా అమాయకులని వాదించడం ప్రారంభించారు.
నిజంగా వారు చెప్పిందే చదివేసి వెళ్లిపోయేంత పలుకుబడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఉన్నట్లయితే.. వారికి నిజంగానే టీడీపీతో సంబంధాలు ఉంటే.. వైసీపీ ఎన్ని ఇబ్బందులు పడి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. తమపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు చేశారనే విషయాన్ని తక్కువచేసి చూపడానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతల్ని అడ్డం పెట్టుకున్నా.. తమకు బీజేపీ నుంచి ముప్పుముంచుకు వస్తుందని వారికి క్లారిటీ వచ్చింది. అయితే.. అదేదో వీలైనంత కాలం ఆలస్యం చేయడానికి.. ముందే్ కొంపకు నిప్పు అంటుకోకుండా ఉండటానికి వైసీపీ నేతలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
గతంలో మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు అది అధికారిక కార్యక్రమం పేరుతో మొత్తం వైసీపీనే లీడ్ తీసుకుంది. జన సమీకరణ చేసింది. అప్పుడు వైసీపీపై ప్రధాని ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ అదే రోజు తెలంగాణలో పర్యటించి బీఆర్ఎస్ పై మోదీ విమర్శలు చేశారు. ఇప్పుడు అమిత్ షా, జేపీ నడ్డాల విమర్శలకు.. టీడీపీని నిందించడం చూస్తూంటే.. వైసీపీ.. పూర్తిగా లాజిక్ మిస్సయిందనే వాదన వినిపిస్తోంది.