కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఇటీవల వీక్ అయ్యారు కానీ అప్పట్లో ఆయన ఇచ్చే పార్టీలు.. చేసే హంగామా.. విశాఖ బీచ్ లో శివలింగాలతో చేసే అర్చనలు ఓ రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు ఆయన దివాలా తీశారు. సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ దాదాపుగా రూ. ఆరు వేల కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,000 కోట్లకు పైగా రుణాలు చెల్లించడం లేదు.
దీంతో బ్యాంకులు కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశాయి. గతంలోనే ఈ అంశంపై జరపగా రుణ పునర్ వ్యవస్థీకరణకు గాయత్రీ గ్రూప్ అంగీకరించింది. కానీ చెల్లింపులు మాత్రం చేయలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కెనరా బ్యాంక్ కన్సార్షియంలు అప్పులిచ్చిన వాటిలో ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన షెర్లను నష్టానికి అమ్మేసుకున్నాయి. ఇప్పుడు గాయత్రి ప్రాజెక్ట్స్ అప్పులన్నీ ఎన్సీఎల్టీ పరిధిలో ఉన్నాయి. అయితే దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే కంపెనీకి చెందిన కొన్ని కార్లు అమ్మేసినట్లుగా పత్రాలు సృష్టించారు.
రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్ లాంటి ఆరు లగ్డరీ కార్లను అమ్మేసినట్లుగా పత్రాలు సృష్టించారు. అది కూడా అతి తక్కువకు. అమ్మిన కార్ల సొమ్మును కూడా కంపెనీకి జమచేయలేదు. దీంతో ఎన్సీఎల్టీకి ఫిర్యాదులు వెళ్లాయి. కంపెనీ పేరుతో కొన్న ఖరీదైన కార్లన్నీ.. .అమ్మేయలేదని… అలా పత్రాలు సృష్టించి.. సొంతానికి వాడుకుంటున్నారని ఫిర్యాదు వెళ్లింది. దీనిపై ఎన్సీఎల్టీ దర్యాప్తు చేయనుంది.
టీ సుబ్బరామి రెడ్డి ప్రమోట్ చేసిన ఈ కంపెనీలో ఆయన సతీమణి ఇందిరా రెడ్డి, కుమారుడు సందీప్కుమార్ రెడ్డి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. దాదాపుగా ఆరు వేల కోట్లు ప్రస్తుతం ఆ బ్యాంకులకు నిరర్థక ఆస్తులుగా మారాయి. దివాలా ప్రక్రియ కొనసాగిస్తే గాయత్రీ ప్రాజెక్ట్స్ ఆస్తుల్ని బ్యాంకర్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ కార్ల లాంటి వాటిని ముందే నొక్కేస్తున్నారు. ఎలాంటి సుబ్బరామిరెడ్డి ఎలా అయిపోయారని రాజకీయ, సినీ వర్గాల్లో బుగ్గలు నొక్కుకుంటున్నారు.