అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఊరట దక్కింది.. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది గ్రేటర్ పరిధిలోనే. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు. ఫలితంగా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావడం ఇప్పుడు అత్యంత ముఖ్యం.
బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించని నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే. తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.
2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పట్నం మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్.. హుటాహుటిన ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తాను ఒకటి కాదు వంద సార్లు కలుస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయవద్దని ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన సంకేతాలు పంపినట్లయింది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి తో తన నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలే కానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మొదటి సారిగా అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 2014లో బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి రాక ముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చేయలేకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు., ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.