ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఇలా లోకేష్ నెంబర్ ప్రకటించగానే అలా లక్షల మంది .. ప్రయత్నించారు. ఈ కారణంగా కొంత మందికి సర్వీసులు ఆలస్యమయ్యాయి కానీ.. ఈ సేవలు మాత్రం పరిపాలనలో ప్రజలకు సరికొత్త సేవలను అందించనున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉండే సర్టిఫికెట్లను తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది. ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికి అయితే పరిమితమైన సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
జగన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చారు. సర్టిఫికెట్లు ప్రింట్ తీసి ఇచ్చేందుకే ఇందులో కొంత మంది ఉద్యోగుల్ని నియమించారు. అయితే ఇప్పుడు ఆ సేవలు ఫోన్ లోనే అందిస్తున్నారు. అయితే ఊరకనే వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా టెస్టులు చేసి.. డౌన్ లోడ్లు చేసుకోవడం వల్ల ఈ ప్రయత్నానికే సమస్యలు వస్తాయి. ఇలాంటి సర్వీసు ప్రారంభించినప్పుడు అందరూ ఆతృతగా ప్రయత్నం చేస్తారు. నిజంగా అవసరం అయి ప్రయత్నించేవారికి ఈ కారణంగా సమస్యలు ఎదురవుతాయి. టెస్టింగ్ చేయడానికి ఉన్న పళంగా పని తీరు చూడాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం ఈ సర్వీసును ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుతూ వెళ్తే.. ప్రభుత్వం ప్రజలకు చేసే సేవల్లో ఇదే గొప్పది అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు తగ్గిపోతారు. ప్రజలకు బోలెడంత సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ప్రజలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే.. ప్రభుత్వం తాము ఎంపిక చేసుకున్న స్ఫూర్తిని కొనసాగిస్తే.. ఇదో మంచి ప్రయత్నంగా నిలిచిపోతుందని అనుకోవచ్చు.