పీవీ సునీల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. పదే పదే ఈ అంశాన్ని రఘురామ తన అసంతృప్తి స్వరంగా వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు కానీ.. సస్పెండ్ చేయడం లాంటివి ఇంకా చేయలేదు. రఘురామ కేవలం ప్రతీకార ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభుత్వం సునీల్ కుమార్ అన్ని వ్యవహారాలపై దృష్టి పెట్టి తదుపరి అడుగులు వేస్తోంది.
రఘురామ నియోజకవర్గంలో ఓ చెరువు కట్టను ఆక్రమించుకున్న వారి ఇళ్లను కోర్టు ఆదేశాలతో తొలగిస్తున్న సమయంలో కొంత మంది బయట వ్యక్తులు వచ్చి గొడవ చేశారు. వారు వచ్చిన కారుపై అంబేద్కర్ ఇండియా మిషన్ అనే పేరు ఉంది. పీవీ సునీల్ బొమ్మ కూడా ఉంది. వారు ఉద్దేశపూర్వకంగా వచ్చి విద్వేషాలు రగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసులు పెట్టారు. అంబేద్కర్ ఇండియా మిషన్ ను పీవీ సునీల్ పెట్టి మత మార్పిళ్లు చేస్తున్నారన్న ఆరోపణలను గతంలో రఘురామ చేశారు . కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు.
పీవీ సునీల్ కుమార్ కు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. జగన్ సీటు ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ ఎందుకో ఇవ్వలేదు. రిటైరైనా తర్వాత పార్టీలో చేరితే ఇస్తారని అనుకున్నారేమో. అయితే ఇప్పుడు ఆయన సొంత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. సొంత రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందన్న సంకేతాలు పంపుతున్నారు. త్వరలో పీవీ సునీల్ వీఆర్ఎస్ కు అప్లయ్ చేస్తారని.. సొంత పార్టీ పెడతారని అంటున్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమపంథాను ఎంచుకుంటారని అంటున్నారు. ఇందు కోసం పోస్టింగ్ లేని ఆయన బ్యాకప్ సమావేశాలు పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.