2013లో హైదరాబాద్ దిల్ సుఖ్నగర్లో సాయిబాబా గుడితో పాటు పలు చోట్ల పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఇప్పటికే వారికి బతికే అర్హత లేదని ఉరిశిక్ష వేయాలని ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఐదుగురు నిందితులకు ఉరి శిక్షే సరైనదని తీర్పు చెప్పింది. ఉగ్రవాద దాడి కావడంతో ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడికి ఇండియన్ ముజాహిదీన్ కారణమని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. 2008 ఢిల్లీ బాంబు దాడులు, 2010 పూణే బాంబు దాడుల ప్లాన్నే హైదరాబాద్లోనూ అమలు చేశారు. ఇండియన్ ముజాహిదీన్ కీలక నాయకుడు యాసిన్ భత్కల్ ఈ దాడిలో కీలక పాత్ర పోషించారు. 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. రియాజ్ భత్కల్ అనే మరో సూత్రధారి ఇప్పటికీ దొరకలేదు. యాసిన్ భత్కల్ తో పాటు కుట్రలో పాల్గొన్న నలుగుర్ని అరెస్టు చేశారు.
ఉరిశిక్ష పడిన వారిలో యాసిన్ భత్కల్ ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు, ఇతర ఉగ్రవాద కేసుల్లో కూడా దోషిగా నిర్ధారణ అయ్యాడు . రియాజ్ భత్కల్ను పట్టుకునేందుకు కేంద్ర సంస్థలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన నిందితులు హైదరాబాద్ జైల్లో ఉన్నారు. వీరికి ఇంకా ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి కొన్ని న్యాయపరమైన మార్గాలున్నాయి. వాటిని వినియోగించుకునే అవకాశం ఉంది. అందుకే ఉరి ఎప్పుడు విధిస్తారన్నదానిపై స్పష్టత లేదు.