వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారతీయుడు కాదని, జర్మన్ పౌరుడని తేల్చి చెప్పింది. చెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
15 ఏళ్లుగా తప్పుడు పత్రాలతో కోర్టులను, అధికారులను సైతం తప్పుదోవ పట్టించారని చెన్నమనేని రమేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రమేశ్ ఫేక్ పత్రాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనకు 30లక్షల జరిమానా విధించింది.
ఇందులో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు , లీగల్ సర్వీసెస్ కమిటీకి 5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేయకుండా తన తప్పును ఒప్పుకుని చెన్నమనేని రమేశ్ రూ. 30 లక్షల ఫైన్ చెల్లించారు.
హైకోర్టు తాజాగా తీర్పుపై ఆది శ్రీనివాస్ స్పందించారు.
15 ఏళ్ల తన పోరాటంలో న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు. చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని అంటూ వ్యాఖ్యానించారు.