విశాఖపట్నంలో మళ్లీ లులూ మాల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 218లోనే ప్రారంభం కావాల్సిన నిర్మాణం జగన్ అధికారంలోకి రాగానే తరిమేయడంతో ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని ఆ సంస్థ ప్రకటించింది. అయితే చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. తాజాగా ఆ సంస్థకు విశాఖ వీఎంఆర్డీఏ ద్వారా 14 ఎకరాలు కేటాయించేలా ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ మాల్, భారీ కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు.
లులూ గ్రూప్ భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది, ఇప్పటికే కేరళ , తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాల్లను నిర్మించింది. విశాఖపట్నం వంటి నగరంలో మాల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తోంది. విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, ప్రభుత్వం నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లభించనుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లులు భావిస్తోంది.
పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్ షిప్ లో భాగంగా నిర్మిస్తున్నందున ఏపీఐఐసీకి కూడా వాటా ఉంటుంది. గతంలో లులుకు కేటాయించిన భూములను జగన్ ప్రభుత్వం రద్దు చేసి ఇతర అవసరాలకు మళ్లించింది. అయితే ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ అవే భూముల్ని కేటాయించడం లేదా.. ఇంకా మెరుగైన ప్లేస్లో భూముల్ని కేటాయించే అంశం పరిశీలించనుంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.