దళితులపై దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కావాలంటే నన్ను కాల్చండి, దళితులపై కాదని హైదరాబాదు సభలో ప్రకటించారు. అంతకు ముందు రోజు తన టౌన్హాల్ ప్రసంగంలోనూ ఈ సమస్య ప్రస్తావించారు. అయితే తర్వాత పరిణామాలు చూస్తుంటే మోడీ మాటలను అనుయాయులు తప్పుగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజదానిలో మోడీ ఈ మాటలు చెప్పిన ఫలితమా అన్నట్టు ఆ మరుసటిరోజునే అమలాపురంలో దళితులపై దారుణమైన దౌర్జన్యానికి పాల్పడ్డారు గుజరాత్ ముఖ్యమంత్రి విజరురూపాని మాత్రం ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమని కొట్టిపారేశారు. రూపాని రాజకీయ ప్రాబల్యం గల పటేళ్ల సమస్యపై చాలా జాగ్రత్తగా మాట్లాడారు గాని దళితుల సమస్యను తేల్చిపారేశారు. బిఎస్పి వారంతా తమ పార్టీలోకివచ్చేశారు గనక యుపిలోనూ గెలవడం ఖాయమని ఆయన ఎన్నికల లెక్కలు చెప్పారు. . అదే విధంగా లోక్సభ చర్చలో హౌం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దళిత సమస్యను రాజకీయం చేయొద్దని విరుచుకుపడ్డారు.అసలు సంగతేమంటే హిందూత్వ సంస్థ ల ప్రతినిధులే గోరక్షణ పేరిట సాటి మనుషులను మరీ ముఖ్యంగా దళితులను హింసిస్తుంటే మరెవరో దానికి కారణమైనట్టు ప్రధాని హితబోధలు చేశారు. ఆయన మాట్లాడిన తరుణంలోనే ఆరెస్సెస్ ప్రతినిధి భయ్యాజీ జోషి కూడా ఈ దాడులు చేస్తున్నవారు సంఘ వ్యతిరేక శక్తులంటూ కొత్త వాదన వినిపించారు.
అంతేగాని రెచ్చిపోయిన తమ వారి చేతలపై ఆత్మ విమర్శ చేసుకోలేదు. గుజరాత్లోని ఉన్లో చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్న దళితులపై దాడి తర్వాతనే బిజెపి ఇరకాటంలో పడి ప్రధాని ఏదోఒక రూపంలో ఖండించాల్సి వచ్చింది. కాని ఆ ఖండన తర్వాత జరుగుతున్నది చూస్తుంటే మోడీ మాట్లాడిన వన్నీ ఇతరులను విమర్శించడానికి తప్ప తమ వారికి కాదని తేలిపోయింది. హెచ్సియులో రోహిత్ ఆత్మాహుతితో మొదలు పెట్టి అమలాపురం ఘటన వరకూ మోడీ సభ నుంచి లోక్సభ చర్చ వరకూ కూడా ఈ దళిత సమస్య ప్రభుత్వాన్ని పరివార్ను కూడా పట్టికుదుపుతూనే వుంది. 26 శాతం మంది దళితులు వున్న యుపి ఎన్నికలలో ఇది కొంప ముంచుతుందనే భయం కూడా బిజెపి నేతలను వెన్నాడుతున్నది. అయితే పాతుకు పోయిన విధానాలను వారైనా మార్చలేరు కదా!