బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్ హైకోర్టుకు చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు సీరియస్ కావడంతో ఆయన ఉదయమే వచ్చి రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. ఆయనపై పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉండటంతో గుంటూరు పోలీసులు .. గుంటూరు తరలించారు.
వ్యవస్థలను సైతం ధిక్కరించేలా బోరుగడ్డ వ్యవహార శైలి ఉండటం సంచలనంగా మారింది. మధ్యంతర బెయిల్ కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. నకిలీ డాక్టర్ రిపోర్టులు ఇచ్చారు. అన్నీ బయటపడిన తర్వాత వీడియో రిలీజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు ఇచ్చిన గడువులోపు లొంగిపోకుండా.. కొత్త నాటకాలు ఆడే ప్రయత్నం చేశారు. ఇలాంటి నాటకాలు ఆడిన బోరుగడ్డకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
వైసీపీలో ఉన్నప్పుడు తాను మగోడ్నని చెప్పుకుని.. జగన్ ఊ అంటే అరగంటలో చంద్రబాబు, పవన్, లోకేష్లను చంపేస్తానని చెప్పేవాడు బోరుగడ్డ. చాలా మంది టీడీపీ నేతలకు ఫోన్లు చేసి బెదిరించేవాడు. ఈ మాటలే కాకుండా ఆయనపై అనేక దందాల ఆరోపణలు .. కేసులు ఉన్నాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి అండతోనే సాధ్యమయింది. ఓ సారి ఆయనను అప్పట్లో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులతో కలిసి ప్రెస్మీట్లు పెట్టించేందుకు ఉపయోగించుకున్నారు. చివరికి ఆ రమణదీక్షితులు..ఈ బోరుగడ్డ అనిల్ ఇద్దరూ సమస్యల్లో చిక్కుకుపోయారు.