ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆయన మూడు సార్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. ప్రధాని మోదీ వరుసగా మూడు సార్లు ప్రధాని అయ్యారని అలాగే చంద్రబాబు కావాలన్నారు. తాను ఆయన నేతృత్వంలో పని చేయడానికి ఎప్పుడూ సిద్దమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలోని ఎ కన్వెన్షన్లో జరిగాయి. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్ర్మంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
చంద్రబాబు ఈ రోజు నవ్వినంతగా గతంలో నవ్వడం తాను చూడలేదన్నారు. ఎమ్మెల్యేలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల బాధ్యత మోస్తున్న చంద్రబాబు.. ఎప్పుడూ గంభీరంగా ఉంటారని.. ఇలా నవ్వే పరిస్థితి ఉండదని.. అంత ఒత్తిడి ఉంటుందన్నారు. అయినా చంద్రబాబును మనస్ఫూర్తిగా నవ్వించేలా చేశారని పవన్ కల్యాణ్ ప్రదర్శన ఇచ్చిన వారిని, స్కిట్లు ప్రదర్శించిన వారిని అభినందించారు.
తాను కూడా ఎన్నో జ్ఞాపకాలతో వెళ్తున్నానని.. వచ్చే కొన్ని రోజుల పాటు తనకు ఇవి గుర్తుంటాయన్నారు. రాజకీయాలు అంటే ప్రజాసమస్యల పోరాటమే కాదని..వ్యక్తిగత కక్షలు కావని ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనుబంధం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత తనకూ పార్టిసిపేట్ చేయాలని అనిపించిందని వచ్చే ఏడాది ప్రయత్నం చేస్తానన్నారు.