చర్చించుకుందామని సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందగానే.. ఇటు చిరంజీవి టాలీవుడ్ పెద్దలతో శిఖరాగ్ర భేటీ నిర్వహించేశారు. సీఎం జగన్ ముందు ఉంచాల్సిన సమస్యలను.. చర్చల అజెండాను ఖరారు చేసుకునేందుకు అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యారు. ప్రధానంగాఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లను ఎలా పరిష్కరించుకోవాలన్న అంశంపై ఎక్కువగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పదేళ్ల కిందటి టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ.. పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ వచ్చిన సమయంలో ప్రభుత్వం జీవో ఇచ్చింది.
ఈ సమస్యను ప్రభుత్వంతో చర్చించి.. గతంలోలా విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను పెంచుకునేలా ఒత్తిడి తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షోకు కూడా అనుమతి ఇవ్వాలని అడగాలని నిర్ణియంచుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్తో సమావేశం ఈ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. టాలీవుడ్లోని ముఖ్యులందరూ కలిసి రావాలని చిరంజీవికి మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ మేరకు.. చిరంజీవి టాలీవుడ్లోని అన్ని వ్యాపార వర్గాల నుంచి ప్రతినిధుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎగ్జిబిటర్స్కు కూడా అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి ఏపీలో మూడు షోలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ కారణంగా చాలా ధియేటర్లను ఇంత వరకూ ప్రారంభించలేదు. వచ్చే నెల నుంచి చిరంజీవి ఆచార్య సహా చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆలోపున సమస్యలు పరిష్కారం అయితే టాలీవుడ్ ఒడ్డున పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వంతో చిరంజీవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు నేరుగా చిరంజీవికే ఆహ్వానం పంపినందున.. ప్రభుత్వం కూడా మెగాస్టార్ ఇచ్చే విజ్ఞాపనలకు సానుకూలంగా స్పందిస్తుందని అంచనా వేస్తున్నారు.