‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’.. ఇలా క్లాస్ టచ్ ఉన్న సినిమాలు తీశాడు కిషోర్ తిరుమల. కొంతకాలంగా ఆయన్నుంచి ఎలాంటి హడావుడీ లేదు. ఇప్పుడు మళ్లీ కిషోర్ పేరు వినిపిస్తోంది. రవితేజకు ఓ కథ చెప్పారని, ఈ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కిషోర్ తిరుమలది క్లాస్ టచ్. రవితేజ ఫుల్ మాస్. మరి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు కిషోర్ తిరుమల ‘అనార్కలీ’ అనే ఓ కథని రెడీ చేశారు. ఇది రవితేజ కోసమా? లేదంటే ఇది వేరే కథా? అనేది తేలాల్సివుంది. అనార్కలి టైటిల్ బాగుంది. కాకపోతే.. లవ్ స్టోరీ సౌండింగ్. ఇలాంటి సాఫ్ట్ టైటిల్ రవితేజకు సెట్ అవ్వదు. కాబట్టి, ఇది పూర్తిగా వేరే సినిమా, వేరే కథ అనుకోవాలి. రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘మాస్ జాతర’ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇది కాకుండా మరో రెండు కథలు ఫైనల్ చేశారు. అందులో `మ్యాడ్` దర్శకుడు కల్యాణ్ శంకర్ కథ కూడా వుంది. ‘మాస్ జాతర’ తరవాత కల్యాణ్ సినిమానే పట్టాలెక్కుతుందని, అది.. 2026 సంక్రాంతికి విడుదల అవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.