సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిశారు. ఆయనతో పాటు పద్మారావు కూడా ఉన్నారు. పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు వెళ్ళామని పద్మారావు మీటింగ్ తరవాత మీడియా ప్రతినిధులు చెప్పారు. తాము వెళ్లే సరికి సీఎం రూమ్ నిండా జనం ఉన్నారని.. తాము ఆయనతో ఏమీ మాట్లాడలేదన్నారు. తాము తీసుకెళ్లిన పేపర్లను వేం నరేందర్ రెడ్డి కి ఆ పేపర్ ఇచ్చి వచ్చేసామని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నాడని నేను వెళ్లానని అంతే అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి కీలక సమయంలో సీఎంను విడిగా కలవడం వల్ల ఎలాంటి ప్రచారాలు జరుగుతాయో వీరిద్దరికీ తెలియనిదేం కాదని అనుకోవచ్చు.
మరో వైపు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ ను కలిసారు. ఇటీవలి కాలంలో రేవంత్ తో సంబంధాల కోసం వీరిద్దరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాము రాజకీయ పరమైన అంశాలతో కలవలేదని.. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు గురించి కలిశామని రాజశేఖర్ రెడ్డి మీడియాకు చెప్పారు. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటుంది. అయినా సహకరించాలని కోరేందుకు కలిసినట్లు అనుకోవచ్చు.
అసెంబ్లీలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. బడ్జెట్ పై ప్రసంగంలో హరీష్ రావు.. .రేవంత్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే తర్వతా వెంటనే ఆయనను కలవడం మాత్రం ఆసక్తికరంగా మారింది. సీఎంను ఎవరైనా కలవొచ్చు కానీ.. ప్రతీ భేటీలోనూ రాజకీయాలు వెదకలేమని కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు అన్న తర్వాత పనులు ఉంటాయని చేయించుకోవడానికి కొన్ని సార్లు కలవక తప్పదంటున్నారు.