కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అల్లుడ్ని తెగ నరికించేసిన మారుతీరావు తరహా ఘటన హైదరాబాద్ శివార్లలో మరొకటి చోటు చేసుకుంది. తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని హేమంత్ అనే యువకుడ్ని యువతి తండ్రితో పాటు బంధువులంతా కలిసి చంపేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ చందానగర్కు చెందిన హేమంత్, అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుటున్నారు. హేమంత్ ఇంట్లో పెళ్లికి అంగీకరించినా.. అవంతి తండ్రి ధర్మారెడ్డి మాత్రం అంగీకరించలేదు. ఒక్క ధర్మారెడ్డి మాత్రమే కాదు.. మిగతా బంధువులంతా వ్యతిరేకించారు. కారణం హేమంత్ కులం వేరే కారణం.. పెద్దగా ఆస్తి లేకపోవడమే.
అయితే అవంతి మాత్రం పెద్దలను ఎదురించి జూన్లోనే హేమంత్నే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రక్షణ కోసం పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు సెటిల్మెంట్ చేశారు. అవంతి పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ తండ్రి పేరిట బదలాయించారు. ఇక వారి జోలికి పోకూడదని పోలీసులు చెప్పి పంపించారు. అయితే.. హఠాత్తుగా అవంతి మేనమామతో పాటు బంధువులంతా మూడు కార్లలో హేమంత్, అవంతి ఉంటున్న ఇంటికి వెళ్లి వారిని బలవంతంగా తీసుకెళ్లారు. అవంతిని మధ్యలో రోడ్డుపై పడేసి.. హేమంత్ను మాత్రం తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత అతను ఔటర్ రింగ్ రోడ్డు పక్కన శవంగా కనిపించారు.
హేమంత్ను అవంతి బంధువులు హత్య చేసినట్లుగా స్పష్టమయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. తను హేమంత్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే.. తనను చంపాలి కానీ .. హేమంత్ను చంపడం ఏమిటని.. అవంతి కన్నీరుమున్నీరవుతోంది. కుల పిచ్చతో ఎంతో భ విష్యత్ ఉన్న నిండు ప్రాణాన్ని తీశారని.. హేమంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతారు. కూతురు ఇష్టపడి జీవితాన్ని గడపాలనుకున్న వ్యక్తిని చంపేసి.. కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ తండ్రి ఇప్పుడు సాధించాడో.. ఎవరికీ అర్థం కావడం లేదు.
మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అవంతి తండ్రి ఎలాంటి శిక్ష అనుభవిస్తాడో కానీ.. పోయిన ప్రాణం మాత్రం తిరగి రాదు. సమాజంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా… వాటి నుంచి పెద్దలు పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. చూడచక్కనైనా జంటగా.. పిల్లలు.. వారికి ఇష్టమైన జీవితాన్ని గడపాలనుకుంటే… ప్రేమతో ఆశీర్వదించాల్సిన పెద్దలు.. కుల, మతాలు.. ఆస్తుల పట్టింపులతో వారి జీవితంలో నిప్పులు పోస్తున్నారు. వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు.