మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు హైడ్రా ఊహించనంత షాక్ ఇచ్చింది. హాఫీజ్ పేటలో ఆయన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి అందులో ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి 17ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. అందులో హైడ్రా బోర్డు పెట్టేసింది. ఆ స్థలాల్లో వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్ కూడా ఉంది. దాన్ని కూడా కూలగొట్టేశారు.
హైటెక్ సిటీకి చేరువలో వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన వసంత ప్రాజెక్ట్స్ ఇరవై ఏళ్ల కిందటి నుంచే విల్లాల నిర్మాణం చేపడుతోంది. మొత్తం 39 ఎకరాల స్థలంలో ఐదు ఎకరాలు రైల్వే తీసుకుంది. 17 ఎకరాల్లో లగ్జరీ విల్లాలు నిర్మించి అమ్మేశారు. మిగిలిన పదిహేడు ఎకరాల్లో హైరైజ్ అపార్టుమెంట్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చేసింది. ప్రభుత్వానివని ప్రకటించేసింది. ఆ పదిహేడు ఎకరాల స్థలం విలువ రెండు వేల కోట్ల వరకూ ఉంటుంది.
వసంత కృష్ణప్రసాద్ తాను ఇరవై ఏళ్ల కిందటే వాటిని కొన్నానని పత్రాలు చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఎన్వోసీ ఇచ్చారని చెబుతున్నారు. కోర్టుల్లో కూడా ఎలాంటి కేసులు లేవంటున్నారు. అయితే రంగనాథ్ మాత్రం తమ పరిశీలనలో అవి ప్రభుత్వ భూములని తేలిందని ప్రకటించేశారు. దాంతో కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని.. కూల్చివేసిన తన ఆఫీసులో అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. సీఎం రేవంత్ దేశంలో లేని సమయంలో హైడ్రా ఇలా చేయడం ఏమిటని .. ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.