ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితకు నోటీసులు వచ్చాయని విస్తృత ప్రచారం జరిగింది. కానీ కవిత మాత్రం అదంతా తప్పుడు ప్రచారమని ట్వీట్ చేశారు. కానీ ఓ సస్పెన్స్ మాత్రం అందరిలో ఉండిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తం 12 మంది వ్యక్తులకు, 18 కంపెనీలకు కూడా ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. అందులో పదకొండు మంది పేర్లు బయటకు వచ్చాయి.
అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, చందన్ రెడ్డి, వై. శశికళ, మాగుంట రాఘవలు పేర్లు బయటకు వచ్చాయి. మరి పన్నెండో వ్యక్థి ఎవరన్నది మాత్రం స్పష్టత లేదు. ఆ వ్యక్తి కవితేనని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ కవిత మాత్రం తనకు ఎలాంంటి నోటీసులు రాలేదంటున్నారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కవిత క్వారంటైన్లో ఉన్నారు. కరోనా కారణంగా ఆమె బయటకు రాలేకపోతున్నారు. ఈ కారణంగా నోటీసుల్ని కుటుంబసభ్యులకు ఇచ్చారని చెబుతున్నారు.
కానీ కవిత మాత్రం ఏమీ అందుకోలేదని అంటున్నారు. నోటీసులు అందుకున్న వారిలో బుచ్చిబాబుగోరంట్ల కవిత ఆడిటర్ కాగా.. అరుణ్ పిళ్లై, అభిషేక్ సన్నిహితులు. అదే సమయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడికి కూడా నోటీసులు అందాయి. కవితకు నోటీసులు వచ్చాయా లేదా అన్నది వచ్చేరెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.