మహాకూటమిలో సీట్లు , స్థానాల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంకు… మహాకూటమిలో అగ్రపీఠం లభిస్తోంది. కూటమికి ఆయననే ముఖచిత్రంగా పెట్టి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. మహాకూటమి… కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా సిద్దం చేసుకుంది. రేపోమాపో ప్రకటించబోతోంది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా .. కోదండరాంను నియమించాలని.. ఢిల్లీలో స్థాయిలో రాహుల్ గాంధీనే నిర్ణయించారు. కూటమి తరపున ప్రధాన ప్రచార కర్త ఆయనే కానున్నారు.
ఎమెల్యే కాకపోయినా చక్రం తిప్పే చాన్స్..!
కోదండరాం నిజానికి… ఓ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. జనగాం సీటును ఆయన కోసం రిజర్వ్ చేశారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వ్యూహాం సిద్ధం చేశారు. కోదండరాం.. ఒక్క స్థానంలో పోటీ చేస్తే.. ఆయన ఆ స్థానానికే సమయం కేటాయించాల్సి వస్తుంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోదండరాం ఇమేజ్ పార్టీకి ఉపయోగపడాలంటే.. ఎన్నికల బరిలో నిలవకుండా.. కూటమి కోసం ప్రచారం చేయాలని కోరారు. దానికి కోదండరాం అంగీకరించారు. జేఏసీ నాయకునిగా కోదండరాంకు… ఉద్యమంలో పని చేసిన యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో టీఆర్ఎస్ సర్కారుపై ఉద్యమకారుల్లో వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకే కాదు.. అసలు గతంలో చెప్పినట్లుగా.. ఉద్యోగాలు సహా ఎలాంటి హామీలు నెరవేరలేదన్నది వారి వాదన. కోదండరాం కూడా.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటున్నదని… ఆంధ్రా కాంట్రాక్టర్లకు. తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని… విమర్శలు గుప్పించారు. కోదండరాంకు ఓ రాజకీయ పార్టీ నేతకు ఉండే ఫాలోయింగ్ కన్నా… భిన్నమైన అనుచరగణం ఉంది.
తెలంగాణ వాదులందర్నీ కూటమి వైపు తీసుకొస్తారా..?
తాము ఎలాంటి తెలంగాణ కోరుకుందో.. కోదండరాంకు క్లారిటీ ఉందని.. ఆయన ప్రభుత్వంలో కలకంగా ఉంటే.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న భావనలో ఉన్నారు. ఇప్పుడు మహాకూటమి వల్ల ఆ పరిస్థితి రావడం అసాధ్యమేమి కాదన్న భావన కనిపిస్తోంది. అందుకే.. తెలంగాణ ఉద్యమకారులు.. కోదండరాం వైపు అంటే.. మహాకూటమి వైపు ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ కు కోదండరాం.. తోడైతే.. కూటమికి అడ్వాంటేజ్ వస్తుందన్న నమ్మకం ఉంది. పోటీతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వంలో కోదండరాం కీలకంగా ఉంటారన్న క్లారిటీ ఉంటుంది కాబట్టి.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు మరో ఆలోచన చేయకపోవచ్చని నేతలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ వస్తే ఏపీ ప్రయోజనాల కోసమే పని చేస్తారన్న వాదనను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం ఇవ్వడం కన్నా… కోదండరాంను ముందు పెడితే సరిపోతుందని కూటమి వ్యూహం సిద్దం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కోదండరాం… తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడతారని ఎవరూ అనుకోరు. అందుకే టీడీపీపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసి.. దాన్ని కాంగ్రెస్ కు అంటించాలనుకుంటున్న టీఆర్ఎస్ కు .. కోదండరామే ఓ సమాధానంగా ఉంచబోతోంది కాంగ్రెస్ పార్టీ. అంటే.. కేసీఆర్ వర్సెస్ కోదండరాం అన్నట్లుగా ప్రచారం సాగుతుంది
ఉత్తరతెలంగాణలో కేసీఆర్ను దెబ్బకొట్టబోతున్న కోదండరాం..!
టీఆర్ఎస్ బలంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలో కోదండరాంను తురుపుముక్కగా కూటమి ఉపయోగించుకోనుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల… గ్రేటర్ తో పాటు దక్షిణ తెలంగాణలోనూ సమీకరణాలు కలసి వస్తాయి. కోదండరాం మహాకూటమికి ఓట్ల పరంగా కాకుండా.. అసలు ఓ ముఖచిత్రంగా ఉండటం వల్లే.. టీఆర్ఎస్ కు ఎక్కువ మైనస్ అవుతుంది. రాహుల్ ఇదే ప్లాన్ అమలు చేస్తున్నారు. పక్కా ఈక్వేషన్స్ను… మహాకూటమి ఫాలో అవుతుంది. ఫలితం ఎలా ఉంటుందో మరి..!