ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చత్తీస్ ఘడ్లో మాత్రమే ఘన విజయం సాధించింది. పదిహేనేళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో.. అతి కష్టం మీద అధికారాన్ని అందుకుంటోంది. మధ్యప్రదేశ్లో అధికారం చేపట్టడానికి రెండు సీట్లు అవసరం అయితే.. ఆ రెండు సీట్లలో బీఎస్పీ గెలుపొందింది. వెంటనే మాయావతి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా రంగంలోకి దిగింది. తాము కూడా కాంగ్రెస్కే మద్దతిస్తామన్నారు. భారీ విజయాలు సాధించి ఉంటే… ఎస్పీ, బీఎస్పీ ఎలా వ్యవహరించేవో కానీ… ఇప్పుడు మాత్రం.. అనుకూలంగా మారిపోయాయి .
కాంగ్రెస్ నాయకత్వం విషయంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. యూపీలో.. కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని ఎప్పుడో కోల్పోయింది. మళ్లీ పెరగడం… మాయవతి, అఖిలేష్లకు ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీని దూరం పెడుతూ వస్తున్నారు. యూపీలో విపక్షాలన్ని కూటమిగా ఏర్పడాలనుకుటున్నాయి. ఉపఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి.. గొప్ప ఫలితాలు సాధించారు.కానీ.. సీట్ల సర్దుబాటు మాత్రం.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో చిక్కుముడిగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉన్న 70 స్థానాల్లో కాంగ్రెస్కు అమేథీ, రాయ్ బరేలీ మాత్రమే ఇస్తామని… బీఎస్పీ, ఎస్పీ చెబుతున్నాయి. దానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. దాంతో.. ఆ పార్టీని దూరం పెట్టారు. మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో వారు.. కాంగ్రెస్కు మరింత ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో… కాంగ్రెస్తో పొత్తులకుఎస్పీ, బీఎస్పీ ముందుకు రాలేదు. ఆయా రాష్ట్రాల్లో రెండు నుంచి ఐదు శాతం ఓటు బ్యాంక్ బీఎస్పీకి ఉంది. అయినప్పటికీ.. కాంగ్రెస్ను దూరం పెట్టారు. కాంగ్రెస్ కు నష్టం చేసేలా అభ్యర్థుల్ని నిలిపారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కారణంగానే… చంద్రబాబుతో వ్యక్తిగతంగా సమావేశం అయిన మాయావతి, అఖిలేష్లు.. విపక్ష కూటమి సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో నేరుగా మద్దతు ప్రకటించినందున.. ఇక వీరు కూడా కాంగ్రెసేతర కూటమిలో చేరిపోయినట్లే…! అంటే.. మూడు రాష్ట్రాల గెలుపుతో.. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లోనూ అతి పెద్ద మిత్రుల్ని కలుపుకున్నట్లే..!