చెన్నైలో జరిగిన డీ లిమిటేషన్ వ్యతిరేక సదస్సులో దక్షిణాదికి చెందిన కీలక రాజకీయ పార్టీలు .. పాతికేళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన వద్దని తీర్మానం చేశాయి. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రితో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇందులో జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ జరిగితే దక్షిణాదికి జరిగే నష్టంపై చర్చించారు. దక్షిణాదికి న్యాయం జరిగే వరకూ పోరాటానికి ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించారు.
జనాభాను పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నందున పాతికేళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని తీర్మానం చేశారు. పలు పార్టీలు సమావేశానికి రాలేకపోయినా తమ వైపే ఉన్నాయని.. డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. వైసీపీ తమ వైపే ఉందని వచ్చే సమావేశానికి ఆ పార్టీ కచ్చితంగా వస్తుందన్నారు. అయితే సమావేశానికి వెళ్లకుండా జగన్ డబుల్ గేమ్ ఆడారు. దక్షిణాదికి అన్యాయం చేయవద్దని మోదీకి లేఖ రాశారు. తదుపరి సమావేశంలో హైదరాబాద్ లో పెట్టడానికి రేవంత్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందరూ కలిసి చర్చించి నిర్ణయానికి వద్దామని స్టాలిన్ చెప్పారు. జేఏసీకి ఓ నాయకుడ్ని కూడా ఎన్నుకుందామన్నారు.
సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలు చేశారు. అందరితో చర్చించే డీలిమిటేషన్ విధివిధానాలు ఖరారు చేయాలన్నారు. అందర్నీ ఒప్పించాలన్నారు. లోక్సభ సీట్ల పెంపును కూడా సభ్యులు వ్యతిరేకించారు. స్టాలిన్ ఈ కూటమిని దగ్గరకు చేర్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ జేఏసీకి కూడా ఆయన ఇంచార్జ్ గా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.