ఏపీ డిప్యూటీ సీఎం గత వారం పది రోజులుగా బయట కనిపించడం లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. అదే సమయంలో ఆయన అధికారిక రివ్యూలు కూడా నిర్వహించలేదు. ఈ మధ్యలో నాగబాబు పుంగనూరులో సభ పెట్టారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చారు కూడా. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన ఆలయాల సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్ బుధవారం నుంచి కేరళలో పర్యటించబోతున్నారు. అక్కడ కూడా పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని.. అధికారిక పర్యటన కాదని చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం సహా పలు ఆలయాలను ఆయన సందర్శిస్తారు. పవన్ వెంట కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన డిప్యటేషన్ పై ప్రస్తుతం ఏపీలో … పవన్ శాఖల్లోనే పని చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కేరళ పర్యటన తర్వాత మూడు రోజుల పాటు తమిళనాడు ఆలయాలను కూడా సందర్శిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అక్కడ రాజకీయంగా పవన్ పర్యటన హాట్ టాపిక్ అవుతుంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పవన్ ఖండించారు. ఆ అంశంపై తమిళనాడులో దుమారం రేగింది. లడ్డూ వివాదం వచ్చినప్పుడు పవన్ ఇచ్చిన తమిళ ఇంటర్యూ కూడా అక్కడ వైరల్ అయింది. పవన్ తమిళనాడులో ఆలయాలు సందర్శిస్తారంటే.. అక్కడ రాజకీయంగానూ అది పెద్ద న్యూసే అవుతుంది.