మరి కొద్ది వారాల్లోనే తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది . వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో లాగా మళ్ళీ వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగుర వేస్తుందా, టిడిపి పుంజుకుంటుందా లేక బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధిస్తాడా అన్న చర్చ జరుగుతోంది .ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
అభ్యర్థి ప్రకటనలో వెనుకబడ్డ బిజెపి:
అభ్యర్థిని నిలిపే విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త ముందు ఉందని చెప్పవచ్చు. అందరి కంటే ముందే పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వైఎస్సార్సీపీ పార్టీ కూడా గురుమూర్తి అనే వ్యక్తిని పోటీలో నిలబెట్టింది. ఆయన పూర్తిగా జగన్ ఇమేజ్ మీద ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రత్నప్రభ లేదా దాసరి శ్రీనివాస్ అని ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్ ల పేర్లు బిజెపి వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
జాతీయ నాయకులు కూడా వస్తేనే ప్రచారానికి పవన్?
తిరుపతి ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఉండే అవకాశం ఉందని మొదట్లో రూమర్స్ వచ్చాయి. తిరుపతి సామాజిక సమీకరణాల కారణంగా జనసేన అభ్యర్థి అయితే కొంత అనుకూలత ఉంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. అయితే బిజెపి నేతలు తిరుపతి స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని నిలబెడతామని పవన్ కళ్యాణ్ ని ఒప్పించారు. అయితే పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి ఆ సమయంలోనే కొన్ని షరతులు విధించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అందులో మొదటిది జాతీయ నాయకులు తిరుపతి ఉప ఎన్నికను జిహెచ్ఎంసి ఎన్నికల లాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారానికి వస్తానంటే నే బిజెపికి సీటు వదులుకోవడానికి తాము సిద్ధం అని పవన్ కళ్యాణ్ అప్పట్లో బీజేపీ పెద్దలతో ప్రతిపాదించారు. దాంతోపాటు టిడిపి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ఢీ కొనగల బలమైన అభ్యర్థిని పోటీకి నిలపాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అంతర్గత సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఈ విధమైన షరతులు పెట్టడానికి ప్రధాన కారణం – రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు కొందరు వైఎస్సార్సీపీతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం పవన్ కళ్యాణ్ కి చేరడమే అని తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి కి మేలు చేసేలా రాష్ట్ర బిజెపి నాయకులు వ్యవహరించకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ జాతీయ నాయకులు తిరుపతి ఉప ఎన్నిక కోసం రావాలని పట్టుబడినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కి నచ్చజెప్పే పనిలో రాష్ట్ర బిజెపి నేతలు:
అయితే రాష్ట్ర బిజెపి నాయకులు సీరియస్ రాజకీయాలు చేయకపోతే వారితో కలిసి ఉండడం జనసేన కు నష్టం చేస్తుంది అన్న అభిప్రాయాన్ని పవన్ ళ్యాణ్ పదేపదే రాష్ట్ర బిజెపి నాయకులతో వెల్లడించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ కు ఏదో రకంగా నచ్చజెప్పి, బిజెపి జాతీయ నాయకులు తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాకపోయినా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ప్రెస్ మీట్ లలో అటు రాష్ట్ర బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇద్దరు కూడా తమ బిజెపి సమావేశాల సమాచారాన్ని సైతం తాము పవన్ కళ్యాణ్ ఇస్తున్నామని, జనసేన పార్టీకి ఇబ్బంది కలిగే నిర్ణయాలు ఏరకంగానూ తాము తీసుకోవడం లేదని, జనసైనికుల ను కలుపుకొని పోతూ ఎన్నికల్లో విజయం సాధించడమే తమ ముందున్న లక్ష్యం అని చెప్పుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ చేత ఏదో రకమైన సానుకూల ప్రకటన చేయించడానికి రాష్ట్ర బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మరి పవన్ కళ్యాణ్ ముందుగా షరతు విధించినట్లు బిజెపి జాతీయ నాయకత్వం ప్రచారానికి రావాలని పట్టుబడతాడా లేక పట్టు సడలించి బిజెపి తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని తెలిసి కూడా ప్రచారానికి వస్తాడా అన్నది వేచి చూడాలి.