వివాదాస్పద కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అటవీ భూముల్ని ఆక్రమించి చేస్తున్న విధ్వంసంపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. గత ప్రభుత్వం షిరిడీ సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారు. వీటిపై పవన్ కల్యాణ్ సమీక్షించారు. భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైనా వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న ఉపాధ్యాయనగర్ గ్రాండ్ వాల్ట్ రోడ్డులో అటవీ సరిహద్దు కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు దప్పిక కోసం, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి అటవీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలో ఉన్న ఫెన్సింగ్ కు తగిన మరమ్మతులు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. శేషాచలం పరిధిలో మానవ ఆవాసాలకు అనుసంధానం అయిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, నీటి తొట్టెల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వన్యప్రాణుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తిరుపతిలో శేషాచలం అడవుల పరిధిలో అటవీ శాఖ అత్యంత సుందరంగా నిర్మించిన దివ్యారామం క్షేత్రంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేయడంపై పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విచారణ చేయాలని ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ పెద్దలకు బినామీ కంపెనీగా గుర్తింపు పొందింది. వేల ఎకరాలు ఆ సంస్థ కు కేటాయించారు. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా పనులు చేపట్టలేదు.