ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాకర్ రావుకు అనుకోని షాక్ తగలింది. ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తూ పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీుకుంది.ల పాస్ పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రభాకర్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు ఆటోమేటిక్ గా క్యాన్సిలేషన్ అవుతుంది. అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు నమోదు అయిన తర్వాత ఆయన పోలీసులతో ఆడుకున్న ఆటలు.. విచారణకు సహకరించకపోవడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ పోలీస్ అధికారి అయిన ఆయన చట్టాన్ని గౌరవించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు బెయిల్ పై ఆశలు పెట్టుకోవడం కష్టంగా మారుతోంది. అదే సమయంలో పాస్ పోర్టు రద్దు చేయడంతో డిపోర్టేషన్ తప్ప మరో మార్గం లేదు.
ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు మరోసారి మంగళవారం ప్రశ్నించారు. ఆయన ఫోన్లతో పాటు ఇతర సాంకేతిక పరికరాల ఆధారాలతో ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి చూస్తూంటే… ఒక్క సారిగా ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరూ వస్తే బీఆర్ఎస్ అగ్రనేతల్ని అరెస్టు చేస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు.