గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు నష్టం కేసు వేస్తే.. అధికారంలోకి వచ్చాక ఆ కేసు విచారణను నిలుపుదల చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి రమణదీక్షితులు అలాంటి ఆరోపణలు చేశారు. అయితే నేరుగా కాకుండా లీక్డ్ వీడియో ద్వారా చేశారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్
పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ వీడియోలో రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ అందులో ఆరోపించారు. టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు అన్నారు. ఈఓ ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహనరెడ్డి క్రిస్టియన్ అని అన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని అన్నారు. ఆయనను చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడని రమణదీక్షితులు వీడియోలో అన్నారు.
అహోబిలంలో గుప్త నిధులు
ఈ మధ్య కొత్త విషయం తెలిసిందని… అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో ఓ జియ్యర్ లోపలకు వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని అంటారు. ఇప్పుడు ఉన్న జియ్యర్ తర్వాత వచ్చే రెండో జియ్యర్కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని చెప్పారు. బెంగళూరులో ఆర్కియాలజీలో పురుషోత్తమరెడ్డి అనే అధికారి ఉన్నాడనీ, అతను పూర్తిగా ధర్మారెడ్డి మనిషి అని అన్నారు.
పరకామణిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
తిరుమల కిచెన్లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు రమణ దీక్షితులు. గుట్కా ప్యాకెట్లు అన్నీ చింపి బయట పోస్తుంటారని తెలిపారు. అందరినీ మ్యానేజ్ చేస్తుంటారు. దర్శనానికి వచ్చే జడ్జిలు, మినిస్టర్లు, ఆడిటర్లు, ఇలా అందరినీ లడ్లు ఇవ్వడం, గుడ్డలు కప్పి మేనేజ్ చేస్తారని అన్నారు. వాళ్లను ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి దించేసి వస్తారని చెప్పారు. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారు. అంతకు ముందు రాతి బండలు ఉండేవి అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెయ్యి కాళ్ల మండపం గానీ, దేవ మండపం కానీ అన్నీ నిధుల కోసమే తవ్వారని ఆరోపించారు. తిరుమల ఆలయం లోపలికి క్రేన్, గోడలకు డ్రిల్లింగ్ చేసి నాశనం చేస్తున్నారన్నారు. ఇష్టమొచ్చినట్లుగా చేసేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఏమి జరగడం లేదని అన్నారు.
అమిత్ షా కు లేఖ రాసిన రామచంద్ర యాదవ్
రమణ దీక్షితులు మాట్లాడిన అంశాలు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై రామచంద్రయాదవ్ సీరియస్గా స్పందించారు. తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయన్నారు. వెంటనే ఈ అంశాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్కి గురైనట్టు ట్వీట్ చేశారు. కానీ ఆయన బుకాయిస్తున్నారని…టీటీడీ వర్గాలు గుర్తించాయి. ఆయనకు వ్యతిరేకంగా ప్రధాన అర్చకులు మీడియా సమావేశం పెట్టారు.