ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. క్రికెట్, కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తోంది. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు చెర్రీ. `రంగస్థలం` తరవాత వీళ్ల కాంబోలో వచ్చే సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే స్క్రిప్టు విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నాడు సుకుమార్. త్వరలోనే సుక్కు విదేశాలకు వెళ్లబోతున్నాడని, తన టీమ్ తో అక్కడే స్క్రిప్టు పూర్తి చేస్తారని తెలుస్తోంది.
ఈలోగా కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే బాగుంటారన్న విషయంలో చూచాయిగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి చరణ్ పక్కన రష్మికని ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చరణ్ – రష్మిక ఇప్పటి వరకూ కలిసి నటించలేదు. దాంతో ఈ జోడీ ఫ్రెష్గా ఉంటుందని సుక్కు భావిస్తున్నాడు. పైగా పుష్ప, పుష్ప 2లలో శ్రీవల్లీగా రష్మిక గుర్తుండిపోయే నటన కనబరిచింది. ఈ సినిమాలతో రష్మికపై సుక్కు నమ్మకం కూడా మరింత బలపడింది. సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్స్ ని రిపీట్ చేయడం సుకుమార్కి ఇష్టం ఉండదు. కానీ చరణ్ సినిమాతో రష్మికని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈ కాంబో చర్చల దశలోనే ఉంది. బుచ్చిబాబు సినిమా పూర్తయ్యేసరికి కనీసం యేడాది పడుతుంది. ఈలోగా.. లెక్కలు మారొచ్చు. కొత్త పేర్లూ రావొచ్చు. ప్రస్తుతానికి ఆ అవకాశం రష్మికకే ఎక్కువ ఉంది.