దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ వద్దని.. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచాలని శాసనసభలో తీర్మానం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్ సభలో డీలిమిటేషన్ చేపడితే రాష్ట్రాల మధ్య వైషమ్యాలు వస్తాయని అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని తీర్మానం చేశారు. గతంలో పాతికేళ్ల వరకూ లోక్ సభ సీట్లను మార్చకుండా రాజ్యాంగ సవరణ చేశారని..ఇప్పుడు కూడా అలా చేయాలని తీర్మానంలో కోరారు.
కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారు. అందుకే ఈ సభలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చట్టాలను పక్కగా అమలు చేశాయని కానీ ఉత్తరాదిలో మాత్రం జనాభా పెరిగిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను భాగస్వాములతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్యవాదులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని, పార్లమెంటరీ నియోజకవర్గాపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, తాజా జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను మాత్రం వెంటనే 119 నుంచి 153కి పెంచాలని అసెంబ్లీ తీర్మానించింది. దీని కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఎంపీ సీట్లు మార్చకుండా.. అసెంబ్లీ సీట్లే మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడం కాస్త భిన్నంగా ఉంది.