మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిక్కుల్లో పడుతున్నారు. ఆయన గతంలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో న్యాయవిద్యను అభ్యసించే ప్రయత్నం చేశారు. స్పీకర్ గా ఉన్నప్పుడు ఈ విషయం కలకలం రేపింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తమ్మినేని సీతారాం ఎలా అడ్మిషన్ తీసుకున్నారని ఆయన విద్యార్హతలు ఏమిటని తెలుసుకున్నారు. తమ్మినేని నకిలీ డిగ్రీ పెట్టారని తేలింది. తమ్మినేని నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేశానని సర్టిఫికెట్ పెట్టారు. కానీ ఆ కాలేజీ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించి చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని తేల్చారు.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే ఆయన యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయట పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు.. ఎందుకు తయారు చేశారు.. ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నది తేలిస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నకిలీ వ్యవహారం బయటపడటంతో తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో తాను డిగ్రీ చదలేదని చెప్పుకున్నారు. మరి ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది.. దాన్ని పెట్టి లా కోర్సులో ఎలా చేరిపోయారన్నది ప్రభుత్వం తేల్చనుంది.