ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గంట పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అంశాలనే చర్చించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానంగా కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించామని ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు.
రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని దీన్ని మంజూరు చేస్తే.. కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. పోర్టులు లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు.
అలాగే మూసి పునరుజ్జీవనానికి సహకరించాలని బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం కావాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి వెంట సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మోదీ గంట పాటు సమయం ఇవ్వడం కష్టం. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం గంటకు పైగా సమయం ఇచ్చి వినతులన్నీ విన్నారు.