తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇంచార్జ్ గా కొత్త వారు వస్తున్నారంటే.. ముందుగా వారిని కాకా పట్టే బ్యాచ్ ఒకటి ఆమెను కలిసి బోకేలు ఇచ్చి పరిచయాలు పెంచుకుని వచ్చేవాళ్లు. కానీ అలాంటి వాటికి ఆమె అవకాశం ఇవ్వలేదు. పీసీసీ కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచారు. రైల్లో వచ్చారు. ర్యాలీలు లాంటివి చేయడం తనకు ఇష్టం ఉండదని.. అలాగే.. కాన్వాయ్ కూడా అవసరం లేదన్నారు. దాంతో రైల్లో కాచిగూడ వచ్చిన ఆమెను పీసీసీ చీఫ్ ఓ పది మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీభవన్ కు తీసుకెళ్లారు.
మీనాక్షి నటరాజన్ చూడటానికి సింపుల్ గా కనిపిస్తారు. కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. తమ టీమ్ లో కీలక బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకూ ఇంచార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షి.. హై క్లాస్ లీడర్. ఆమె హైదరాబాద్ లో ఓ పెద్ద బంగళా అద్దెకు తీసుకుని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన ప్రయోజనాలూ పొందారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకునేవారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటి ఆడంబరం ఒక్కటి కూడా లేదు.
పార్టీ నేతలకు ఆమె చాలా స్పష్టమైన సందేశాన్ని ఎంట్రీ లోనే ఇచ్చారు. కాకా పట్టే లీడర్లకు అవకాశమే ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఫ్లెక్సీ లీడర్లకు కూడా ముందుగానే వార్నింగులు వెళ్లాయి. కాకాలు పట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అది మైనస్ అవుతుందని తెలియడంతో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టలేదు. పార్టీ కోసం పని చేసే వారికి మాత్రమే మీనాక్షి నటరాజన్ ప్రాధాన్యం ఇస్తారని క్లారిటీ ఉండటంతో అందరూ తాము పార్టీ కోసం ఏం చేశామో చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె కూడా.. ఏం పని చేయాలో కాంగ్రెస్ నేతలకు స్పష్టంగానే చెప్పారు.
ఇంత కాలం పదవుల భర్తీ కాలేదు. ఆరు మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీనంతటికి కారణం దీపాదాస్ మున్షినేనని చెబుతారు. ప్రతీ దానికి ఆమె రేవంత్ చెప్పే దానికి భిన్నంగా నివేదికలు ఇవ్వడంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయిందని చెబుతారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిక్కచ్చిగా ఉంటారు. ఏదో ఒకటి తేల్చేస్తారు. అందుకే పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు కూడా ఆశపడుతున్నారు.