తెలంగాణ మంత్రివర్గంలో నలుగురు మంత్రుల్ని తీసుకోనున్నారు. ఉగాదికి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారికంగా ఖరారు కాలేదు. ఎవరికీ సమాచారం లేదు. అయితే ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజికవర్గాలను బేస్ చేసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేశారని అంటున్నారు. ఎస్సీ, బీసీ, ముస్లిం, రెడ్డి వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఎస్సీ వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ప్రధానంగా రేసులో ఉన్నారు. ఆయనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్, తండ్రి వెంకటస్వామికి కాంగ్రెస్ లో ఉన్న రికార్డు అన్నీ కలిసి వచ్చి ఆయన మంత్రి కావడం ఖాయమని చెబుతున్నారు. అయితే తనకు చాన్స్ ఇవ్వాల్సిందేనని ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీ పడుతున్నారు. ఆయనకు సామాజిక సమీకరణాల్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు తుది దశలో ఉన్నాయి. ముదిరాజ్ వర్గానికి ఇవ్వాలనుకుంటే వాకిటి శ్రీహరికి.. మున్నూరు కాపులకు ఇవ్వాలనుకుంటే ఆది శ్రీనివాస్ కు ఇస్తారు. మున్నూరు కాపు వర్గం నుంచి ఇప్పటికే కొండా సురేఖ ఉన్నారు. దీంతో శ్రీహరికే ఖరారవుతుందని అంటున్నారు. మరొకిరికి కేబినెట్ హోదాతో పోస్టు ఇచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చిన అమీర్ అలీ ఖాన్ కు అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. అయితే అజారుద్దీన్ తో పాటు నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇక రెడ్డి వర్గం కోసం కేటాయించే స్థానంలో కోసం చాలా పోటీ ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా మారింది. రెండు స్థానాలను ఖాళీగా ఉంచాలని అనుకుంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి వస్తే మరో స్థానం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.