తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు అనర్హతా భయం వెంటాడుతోంది. స్పీకర్ తప్ప మరొకరు అనర్హతా వేటు వేసే అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువులోపే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. మీరు చెప్పకపోతే మేమే గడువు చెప్పాల్సి వస్తుందని అసెంంబ్లీ కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలకూ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదన్న వాదనను వినిపించడానికి రెడీ అయ్యారు.
పార్టీ మారలేదని వాదించేందుకు ఎమ్మెల్యేలు రెడీ
బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇది టెక్నికల్గా నిరూపించడం దాదాపుగా అసాధ్యం. కండువాలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారారని అర్థం కాదని వాదించే అవకాశం ఉంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పటికే తాను పార్టీ మారలేదని మర్యాదపూర్వకంగానే కలిశానని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. తనకు కప్పిన కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కాదని ఆయన వాదించబోతున్నారు. గద్వాల ఎమ్మెల్యే అయితే తాను పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. ఇదంతా సుప్రీంకోర్టులో చూపించుకోవడానికే. సాంకేతికంగా వారు పార్టీ మారినట్లుగా నిరూపించాలంటే.. విప్ ఉల్లంఘించినట్లుగా నిరూపించాలి. ఇప్పటి వరకూ ఎలాంటి విప్లు ఉల్లంఘించలేదు.
కాంగ్రెస్ లో ఇమడలేరు..బీఆర్ఎస్లోకి వెళ్లలేరు !
బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకోలేరు.. అలాగని బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై అనర్హతా వేటు వేయించి ఉపఎన్నికలు తీసుకు రావాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో 40 మందికిపైగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగపరంగా.. స్పీకర్ అనర్హతా వేటు వేస్తే తప్ప ఉపఎన్నికలు రావు. సుప్రీంకోర్టు ఈ విషయంలో సూచిస్తుంది కానీ ఆదేశాలు జారీ చేయలేదు. అందుకే ఉపఎన్నికలు రావని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
చేరికల్లో వ్యూహం లేకపోవడం వల్లే ఈ దుస్థితి
చేరికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన వ్యూహం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తాము విలీనం చేసుకున్నాం కానీ ఫిరాయింపులు కాదని కేటీఆర్ అంటూ ఉంటారు. అలాంటి విలీనమే చేసుకుంటే సరిపోయేది. కానీ అప్పుడొకరు.. అప్పుడొకర్ని చొప్పున చేర్చుకోవడం వల్ల విలీనం స్థాయిలో ఎమ్మెల్యేలు రాలేదు. ఆకర్షించలేకపోయారు. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా వారంతా ఆగిపోయారు. ఈ పది మంది మాత్రమే ఇరుక్కుపోయారు. వారి పదవులకు ఏ ఢోకా ఉండకపోవచ్చు కానీ వారి రాజకీయ జీవితం మాత్రం గందరగోళంలో పడిందని అనుకోవచ్చు.