ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలను పరిష్కరించేందుకు తొలి సారిగా త్రిసభ్య కమిటీ సమావేశం అవుతోంది.రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో అత్యంత కీలకమైన ఐదు అంశాలను తొలి సమావేశం అజెండాలో చేర్చారు. ఇందులో ముఖ్యమైనవి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధులే. తెలంగాణ డిస్కంల నుంచి రూ.3,442 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్కో వాదిస్తోంది. ఇందు కోసం హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. కేంద్రం నుంచి ఎవరొచ్చినా ఏపీ సీఎం తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలిప్పించాలని కోరేవారు.
కానీ తెలంగాణ మాత్రం తమకే ఇవ్వాలని వాదిస్తోంది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ను విభజిస్తే ఏపీకి దండిగా నిధులు వస్తాయి. దీనికి సంబంధించి 250 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకుంది. అవి ఇస్తే భారీగా ఏపీకి నిధులొస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఏ రాష్ట్రం ఎంత భరించాలో ఈ సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ కూడా ఏపీ నుంచి నిధులు రాాల్సి ఉందని చెబుతోంది.
ఏపీ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రూ.495 కోట్ల నిధులు రావాల్సి ఉందని … హైకోర్టు, రాజ్ భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.315 కోట్లనూ ఏపీ ఇవ్వాల్సి ఉందని వాదిస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాల్లో వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, రూ.208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వర్డ్ నిధులు సైతం ఏపీ నుంచి రావాల్సి ఉందని వాదిస్తోంది. గురువారం సమావేశంతోనే అద్భుతాలు జరిగిపోతాయని అధికారులు భావించడం లేదు. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రతి నెలా సమావేశవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.