వైసీపీ నేతలకు హెల్త్ అసలు బాగుండటం లేదు. అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది కేసులు ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే ఏ క్షణమైనా పోలీసులు వస్తారని ..తలుపులు కొడతారని బయపడేవారే. విచిత్రం ఏమిటంటే వారి అనారోగ్యాన్ని చూపించి మరికొందరు ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేయడం. ఈ వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
కొడాలి నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషంట్ గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండెనొప్పి అని ప్రచారం జరిగింది. నిజానికి కొడాలి నాని ఆస్పత్రిలో ఇన్ పేషంట్ గా చేరింది.. గుండెనొప్పితో కాదని పూర్తి స్థాయి పరీక్షల కోసమేనని చెబుతున్నారు. గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయని ప్రచారం చేయించుకున్నారు. అయితే ఆయన ఆ రిపోర్టుతో డిశ్చార్జ్ అయ్యారు. నిజానికి కొడాలి నానిపై గుడివాడలో నమోదైన కొన్ని కేసుల్లో ఆయన ప్రమేయంపై ఆధారాలు సేకరించారు. కొంత మంది ఖాతాల్లో డబ్బులు వేసి చివరికి తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా గుర్తించారు. ఇక అరెస్టు ఖాయమని అనుకున్న సమయంలో ఈ ఆస్పత్రి ఎపిసోడ్ జరిగింది.
లిక్కర్ స్కాంలో ప్రధానంగా వినిపిస్తున్న మిథున్ రెడ్డి, భూ, గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా సమస్యలు వచ్చాయి. పెద్దిరెడ్డి కిందపడి చేయికి సర్జరీ చేయించుకున్నారు. ఆయన సర్జరీని చూపించి హైకోర్టులో ఇంకా తన పేరు నమోదు కానీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. వీరి అనారోగ్యం వ్యవహారాలు.. వెంటాడుతున్న కేసులు చూసి ఇదేదో తేడాగా ఉందని రాజకీయవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.