టిక్కెట్లు పొందిన పార్టీ నేతలు కూడా మీకో దండం అనే పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కర్నూలు ఎంపీ టిక్కెట్ ను సీఎం జగన్ కేటాయించారు. జడ్పీటీసీగా ఉన్న విరూపాక్షికి టిక్కెట్ కేటాయించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేయబోనని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనకుంటున్నానని జయరాం చెబుతున్నారు.
ఆలూరుకు కొత్త ఇంచార్జిని ప్రకటించి నతర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చారు. కార్యకర్తలతో సమావేశం పెట్టి ఎంపీ టిక్కెట్ జేబులో ఉంది కానీ ఆలూరును వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాకర్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరుకు వచ్చినా ఎవర్నీ కలవలేదు. వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు .
ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ లో చేరి అయినా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మంత్రి నాగేంద్ర ఆయనకు సమీప బంధువు. కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ఆలూరు టిక్కెట్ కేటాయించడం ఖాయమే.
వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదని క్లారిటీ రావడంతో గుమ్మనూరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచే జడ్పీటీసీగా గెలిచిన గుమ్మనూరు జయరాం తర్వాత పార్టీ మారారు. కానీ ఆయనను మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరి తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు.