పార్టీ మారుతున్నారని తెలిస్తే అనర్హత వేటు వేశారు ఎన్నికలకు ముందు. కనీసం వివరణ తీసుకోలేదు. శాసనమండలి చైర్మన్ పేరుతో అనర్హతా వేటు వేస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు వచ్చేవి. కానీ ఇప్పుడు వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి నేరుగా వేరే పార్టీలో చేరిపోయారు. అయినా కూడా రాజీనామాలు ఆమోదించడం లేదు. వారు మా రాజీనామాలు ఆమోదించండి మహా ప్రభో అని బతిమాలుకుంటున్నారు. కానీ పరిశీలిస్తున్నామంటున్నారు. వైసీపీ పరిస్థితి తలకిందలయిందనడానికి .. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే ఘోర మనస్థత్వానికి ఇంత కంటే సాక్ష్యం ఏముంటుంది?
రాజీనామాల ఆమోదం కోసం చూస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీలు
వైసీపీకి ఐదుగురు ఎమ్మెల్సీలు మీ పార్టీకో దండం అని చెప్పేశారు. వారు తమ రాజీనామా లు చేసి నెలలు అవుతుంది. ఇప్పటి వరకూ ఆమోదించలేదు. వారు శాసనమండలికి వచ్చి మా ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదించండి అని నేరుగా చైర్మన్ నే అడుగుతున్నారు. కానీ ఆయన మాత్రం నేరుగా సమాధానం చెప్పడం లేదు. వైసీపీకి చెందిన చైర్మన్ కావడంతో ఆయన హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నారేమో కానీ వైసీపీ చెప్పిన విలువలకు ఇది పూర్తి తేడాగా ఉందని అర్థం చేసుకోలేకపోతున్నారు.
రాజీనామాలు ఆమోదిస్తే మరో ఎనిమిది మంది రెడీ
ఆ ఎమ్మెల్సీలు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. పాల్గొనే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నేతలను ఇంకా అంటి పెట్టుకుని ఉంచుకోవడం ఎందుకు?. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజీనామాలు ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చిన మరుక్షణం మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు అదే బాటలో ఉన్నారు. ఎవరూ ఊహించని పేర్లు అందులో ఉంటాయని అంటున్నారు. ఈ సమాచారంపై స్పష్టత ఉంది కాబట్టే తమ చైర్మన్ తో రాజీనామాలు ఆమోదించకుండా చూస్తున్నారని అంటున్నారు.
మండలిలో కూడా ప్రతిపక్ష హోదా పోతుందన్న భయమా ?
ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు ప్రోటోకాల్ ఉంది. జగన్ కు లేని ప్రోటోకాల్ ఉంది.కానీ అక్కడ కూడా ప్రతిపక్ష నేత హోదా పోతుందేమోనని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో వైసీపీ తరపున ఒక్క ఎమ్మెల్సీ కూడా ఉండే అవకాశం లేదు. బొత్స కూడా వంశీకృష్ణ రాజీనామా చేసిన స్థానంలో మిగిలిన కాలానికే ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగే ఏ ఎమ్మెల్సీ స్థానంలోనూ వైసీపీ వాళ్లు గెలిచే చాన్స్ లేదు. అందుకే రాజీనామాలు ఆమోదించి పరువు నిలబెట్టుకుంటే బెటరన్న అభిప్రాయాలు ఆ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నాయి.